కరోనా నేపథ్యంలో చైనాపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం అమెరికా ..చైనా దేశస్థుడికి అమెరికాలో అరుదైన గుర్తింపునిచ్చింది. కోవిడ్-19 వైరస్ని మొట్టమొదటి సారిగా గుర్తించి ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన చైనా డాక్టర్ లీ వెన్లియాంగ్కు అమెరికాలో అత్యంత గౌరవం కల్పించింది. వాషింగ్టన్ డీసీలోని చైనా ఎంబసీ ముందు ఉన్న ఇంటర్నేషనల్ ప్రాంతానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. సెనేటర్లు అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీనికి ఆమోదం తెలిపారు.
వుహాన్కు చెందిన లీవెన్లియాంగ్ తొలిసారి కరోనా వైరస్ గురించి అనుమానం వ్యక్తం చేశాడు. తన వద్దకు వచ్చిన రోగులను పరీక్షించి ఏదో మహమ్మారి ప్రపంచాన్ని వణికించబోతోందని హెచ్చరించాడు. తన డాక్టర్ల బృందంతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. దీంతో అతన్ని అప్పట్లో చైనా ప్రభుత్వం అరెస్టు చేసింది. కొన్ని రోజులకే లీ వెన్లియాంగ్ కరోనా వైరస్ బారీన పడి చికిత్స పొందుతూ మరణించాడు. మృతిచెందిన ఆ డాక్టర్కు అగ్రరాజ్యం అమెరికా తగిన గుర్తింపునిచ్చింది. అమెరికాలోని ఓ కాలనీకి అతడి పేరును పెట్టాలని నిర్ణయించుకుంది.
అయితే, ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఎంటంటే…అమెరికా తీసుకున్న నిర్ణయంతో చైనా ఆగ్రహంతో మండిపోతోంది. మరోవైపు లీ వెన్లియాంగ్ మృతితో చైనా వ్యాప్తంగా ప్రజా ఆగ్రహం వెల్లువెత్తింది. అతడు చెప్పినట్టుగానే కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఆ తర్వాత అతని కుటుంబాన్ని చైనా ప్రభుత్వం క్షమాపణ కోరింది. అయితే, అమెరికా తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు చైనా ఆగ్రహంగా ఉందట. మరోవైపు అమెరికాలో ఇటువంటి నిర్ణయాలు అమలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ సెనెటర్లు ఈ విధమైన తీర్మానం చేయడం విశేషం. 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. మరి ఇప్పుడైనా అమలు జరుగుతుందో లేదో చూడాలంటూ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.