కేరళ లోని మళప్పురంలో పదో తరగతి చదువుతున్న స్కూలు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తనకు తాను నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఆన్ లైన్ ద్వారా క్లాసులకు హాజరు కాలేకపోయానన్న దిగులుతో ఈ దారుణానికి ఒడిగట్టింది. తమ ఇంట్లో టీవీ ఉందని, కానీ పని చేయని దాన్ని మరమ్మతులకు ఇవ్వాలని తమ కూతురు కోరిందని ఆ బాలిక తండ్రి తెలిపాడు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆ టీవీని మరమ్మతు చేయించలేకపోయానని ఆయన చెప్పాడు. రోజువారీ శ్రామిక జీవి అయిన ఆ తండ్రి.. ఆ పాత టీవీని కనీసం రిపేర్ చేయించలేకపోయాడు. తన కుమార్తె ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడంలేదని, మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి టీవీలో ఆన్ లైన్ తరగతులకు అటెండ్ కావాలని తను కోరానని ఆయన చెప్పాడు. ఈ బాలిక తల్లి ఇటీవలే ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. పై చదువులు చదవలేనని తన కుమార్తె ఎంతో మధన పడేదని ఆ పేద తండ్రి తెలిపాడు. ఈ విషాద ఘటనపై కేరళ విద్యా శాఖ మంత్రి రవీంద్రనాథ్.. జిల్లా అధికారులనుంచి రిపోర్టు కోరారు.