ఉచితంగా హోం ఐసొలేషన్‌ కిట్లు.. ఇళ్లవద్దకే పంపిణీ

|

Jul 13, 2020 | 6:33 PM

పంజా విసురుతున్న కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఉచితంగా హోం ఐసొలేషన్‌ కిట్లు.. ఇళ్లవద్దకే పంపిణీ
Follow us on

పంజా విసురుతున్న కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోంది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారికి పెద్ద సంఖ్యలో టెస్టులు, త్వరగా ఫలితాలు వచ్చేలా ముమ్మర కార్యాచరణ అమలు చేస్తోంది. తాజాగా కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ సోకిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైరస్ బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారికి సర్కారు హోం ఐసొలేషన్‌ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కరోనా బాధితులకు సాయం అందించేందుకు గానూ, ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.

రాష్ట్రంలో దాదాపు 12 వేలకు పైగా బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని, వారందరికీ అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్‌ ద్వారా తగు సూచనలు ఇస్తున్నారని చెప్పారు. అత్యవసరమైనవారి కోసం త్వరితగతిన అంబులెన్సులను ఇండ్లకు పంపించి కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, హోం ఐసోలేషన్‌లో ఉంటున్న బాధితులకు కేర్ టేకర్‌గా కుటుంబ సభ్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. అయితే, వారికి పూర్తి తర్ఫీదు ఇచ్చిన తర్వాతే ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 80శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారని వివరించారు. అటువంటి వారికి హోం ఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉంటాయని చెప్పారు. దీంతోపాటు హోం ఐసొలేషన్‌‌లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్‌, కాల్‌ సెంటర్‌ నంబర్లు, వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబైల్‌ నంబర్లను పొందుపరిచారు. ఇప్పటివరకు 29 వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉండి క్యూర్ అయినట్లుగా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.