దేశంలో కరోనా రక్కసి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజువారీ కొత్త కేసులు భారీగా నమోదవుతూ.. పాత రికార్డులు ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తున్నాయి. కోవిడ్ కోరల్లో చిక్కుకుని మహారాష్ట్ర వణికిపోతోంది. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 10వేలను చేరింది. కాగా, ఒక్క ముంబైలోనే కోవిడ్ 19 కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ఇందులో 23వేల యాక్టివ్ కేసులు ఉండగా.. 71 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 5714 మంది వైరస్ వల్ల మరణించారు. ఇదిలా ఉంటే, ముంబైలోని ధారవిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ధారవిలో మొత్తం కేసులు 2500లకు చేరుకున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ధారవిలో సోమవారం మరో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. వీటితో కలిపి ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,492కి చేరింది. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ధారావిలో 147 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మొత్తం 2,492 కొవిడ్-19 పేషెంట్లలో 2,095 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఒకప్పుడు కరోనా హాట్స్పాట్గా ఉన్న ఈ మురికివాడలో… ఇప్పుడు కరోనా కేసులు నెమ్మదించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సైతం ప్రశంసలు కురిపించింది.