రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఇటీవల బ్లాక్ మార్కెట్లో కరోనా మందుల దందా అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ శనివారం రోజున తన కార్యాలయంలో మందుల కొరతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫార్మా కంపెనీలు, డీలర్లు, ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, డాక్సామెతాసోన్, మిథైల్ ప్రెడ్నిసోలొన్ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్-డి, విటమిన్-సి, మల్టీవిటమిన్, జింక్ వంటి ఔషధాలను మందుల షాపులు, ఆస్పత్రుల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు. విటమిన్ ట్యాబ్లెట్లు, యాంటీబయాటిక్లు, కొవిడ్ చికిత్స కోసం వాడే మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఈటల హెచ్చరించారు.