తెలంగాణలో కరోనా వైరస్ రెండోదశలోకి చేరుతోంది. రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకుల బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ అంతా హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డ ఇండోనేసియా బృందాన్ని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా పేషెంట్లను కలిసిన కరీంనగర్ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో.. స్థానికుల్లో మరింత ఆందోళన మొదలైంది.
ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులకు కరోనా వైరస్ ఉండటం వల్లే కరీంనగర్ వ్యక్తికి కూడా సోకిందని కలెక్టర్ శశాంక్ తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్, అధికార యంత్రాంగంతో కలిసి జిల్లాలో పర్యవేక్షిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. కరోనా సోకిన కరీంనగర్ వ్యక్తితో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా తెలుసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ఎవరైతే తిరిగారో.. వాళ్లు వెంటనే ఆస్పత్రికి వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.. అంతేకాకుండా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కరీంనగర్లో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని గుర్తించారు. అలా అయితే కోచింగ్ సెంటర్కు వచ్చే విద్యార్థులను కూడా కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే అప్రత్తమైన పారిశుద్ద్య యంత్రాంగం.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 3 కిలోమీటర్ల చుట్టుపక్కల రోడ్లపై స్ప్రె చేశారు.. కరీంనగర్లో ప్రజలంతా లాక్డౌన్ను పాటించాలని.. ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని కలెక్టర్ శశాంక కోరారు. కరోనా పేషెంట్లను కలిసిన వారికి కరోనా సోకడం.. వారి ద్వారా మరొకరికి సోకడం లాంటివి జరిగితే కరోనాను అరికట్టడం కష్టం అవుతుంది. ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కేసులు 28కి చేరాయి.