దేశంలో కరోనా రికవరీ రేటు 27.41 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తికి చేరలేదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల నుంచి ఆలస్యంగా నివేదికలు అందుతున్నాయని, సమగ్ర వివరాలు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటింటి సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.
మంగళవారం నమోదైన తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరుకుంది. కరోనా కారణంగా భారత్లో ఇప్పటివరకు 1568 మంది మరణించారు. 12,727 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. మే 7 నుంచి విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొస్తామని లవ్ అగర్వాల్ తెలిపారు. వారంలోగా ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ తాజా వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
కరోనా వైరస్ కేసుల విషయంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడంలో జాప్యమవుతోందని గుర్తించారు. దీంతోనే తాజా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశమంతా ఒకేసారి పరీక్షలు చేస్తే కరోనా బాధితులు వెలుగులోకి వస్తారని.. వారందరినీ ఆస్పత్రికి తరలించి వైరస్ చైన్ని కట్ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇంటింటి సర్వేకు నిర్వహించాలనే కీలక నిర్ణయ తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.