India Lockdown: కొన్నిసార్లు మూగ పక్షుల మరణం ప్రతీ ఒక్కరి మనసులను ఎంతగానో కలిచి వేస్తుంది. ఏదైనా కరెంట్ తీగ తగలడం లేదా తీవ్రమైన ఎండ వేడిని తట్టుకోలేక అవి మరణిస్తుండటం సహజం. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున పక్షులు మృతి చెందితే.? అంత దారుణంగా ఎలా మరణిస్తున్నాయి.? అనే అనుమానం కలుగుతుంది. సరిగ్గా ఇప్పుడు కూడా అదే రీతిలో డౌట్స్ మొదలయ్యాయి. తాజాగా తమిళనాడులోని పనపాక్కం సమీపంలో కాకులు పెద్ద ఎత్తున మరణించడం తీవ్ర కలకలం రేపింది. ఇక అవి చనిపోవడానికి కారణాలు ఏంటన్న దానిపై ఆరోగ్య శాఖ అధికారులు కూపీ లాగుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పనపాక్కం సమీపంలోని కులత్తుమేడు ప్రాంతంలో 1వ తేది సాయంత్రం 5 గంటలకు అకస్మాత్తుగా పదికి పైగా కాకులు మృతి చెందాయి. దీన్ని గమనించిన ఆ ఊరి వాసులు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో ఆహారం లేక కాకులు చనిపోయి ఉండవచ్చునని భావించారు. అంతటితో ఆ విషయాన్ని వదిలేశారు.
అయితే ఆ తర్వాత రోజు అదే ప్రాంతంలో ప్రజల నివాస గృహాలపై వాలిన కాకులు మళ్లీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మృతి చెందాయి. ఇక శనివారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో స్థానికులు ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇవి ఆకలితో చనిపోతున్నాయా.? లేక ఏదైనా వైరస్ సోకిందా.? అన్న దానిపై స్పష్టత రాలేదు. మరి ఆరోగ్య శాఖ అధికారులు ఈ మరణాల వెనుక రహస్యాన్ని చేధిస్తారో లేదో చూడాలి..!
ఇది చదవండి: తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..