మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇరవై వేలకు పైగా నమోదయ్యయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబై,పూణె, థానే నగరాల్లోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహారాష్ట్రను పట్టిపీడిస్తున్న సమస్య మరోకటి ఉంది. కరోనా కట్టడిలో వైద్యులతో పాటు ముఖ్య పాత్ర పోషించే పోలీసులు కూడా దీని బారినపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 786 మంది పోలీసులకు కరోనా సోకిందని మహారాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. వీరిలో 76 మంది కరోనా నుంచి కోలుకొని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో ఏడుగురు పోలీసులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులకు కూడా ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇదిలా ఉంటే కరోనా బారినపడ్డ పోలీసులకు చికిత్స అందించేందుకు పలు ప్రైవేట్ ఆస్పత్రులతో మహా పోలీసులు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.
కాగా.. ఆదివారం నాడు మహారాష్ట్ర పోలీస్ ఉన్నాతాధికారులు రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సమయంలో జరిగిన క్రైం కేసుల వివరాలను విడుదల చేశారు. మార్చి 22 నుంచి 200 మంది పోలీసులపై దాడి కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 732 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన మరో 660 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అంతేకాదు దాదాపు 55వేల వాహనాలను సీజ్ చేశామని.. వారికి రూ. 3.8కోట్లు ఫైన్ వేశామన్నారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 80 మంది పోలీసులు పలు దాడుల్లో గాయపడ్డారని.. అలాగే 32 మంది ఆరోగ్య కార్యకర్తలపై కూడా దాడులు జరిగాయని రిపోర్టులో వెల్లడించారు.