ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనాను ఎలాగైనా కట్టడి చేయాలని దేశాధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్ను ప్రకటించాయి. ఈ మహమ్మారికి సోకకుండా ఉండేందుకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. మరోవైపు కరోనాపై ఎప్పటికప్పుడు దేశాలను అప్రమత్తం చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఈ వైరస్పై పోరుకు నిధులను సేకరించే పనిలో పడింది. ఈ క్రమంలో టాప్ సెలబ్రిటీలతో ఈ నెల 18న లైవ్ ఈవెంట్ పెట్టేందుకు సిద్ధమైంది.
ఈ ఈవెంట్లో జాన్ లెజండ్, లేడి గాగా, డేవిడ్ బెక్హమ్, ఎల్టన్ జాన్, ఐడ్రిస్ ఎల్బా తదితరులు భాగం కానున్నారు. వారితో పాటు భారత్ నుంచి కింగ్ఖాన్ షారూక్ ఖాన్, దేవీ గర్ల్ ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ఇక ఈ షోకు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన స్టీఫెన్ కోల్బర్ట్, జిమ్మి ఫెలోన్, జిమ్మీ కిమ్మెల్ వ్యాఖ్యాతలుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి WHO ఒక ప్రపంచం: ఇంటి వద్ద కలిసి(One World: Together at home)అనే క్యాప్షన్ను పెట్టింది. కాగా భారత్లోనూ కరోనాపై అవగాహన తీసుకొచ్చేందుకు అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, రణ్బీర్ కపూర్, అలియా, ప్రియాంక తదితరులు కలిసి ఫ్యామిలీ అనే ఓ లఘు చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
Read This Story Also: తబ్లీగి జామాత్: హకీంపేట మజీదు ఇన్చార్జిపై క్రిమినల్ కేసు