తమిళనాడులో వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గటం లేదు. కట్టలు తెంచుకున్న ప్రవాహంలా ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోరలు చాస్తోన్న కోవిడ్ కారణంగా తమిళనాడు చిగురుటాకుల వణికిపోతోంది. ఇంటి నుంచి కాలు భయటపెట్టాలంటేనే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా, శనివారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, మృతుల సంఖ్య కూడా పెరిగింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,807 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా బారినపడి శనివారం ఒక్కరోజే 88 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఒక రోజులు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కాగా, తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,65,714కి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2,403కి పెరిగింది.