
కరోనా మహమ్మారి చాపకింద నీరులా మనుషుల ప్రాణాలను హరిస్తుంది. కరోనాను కట్టడి చేయడం కోసం అత్యధిక టెస్టులు, కాంటాక్టుల ట్రేసింగ్, వైరస్ బాధితులకు తగిన ట్రీట్మెంట్ వంటి ఐసీఎంఆర్ సూచనల మేరకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్తోపాటు అరగంటలోనే ఫలితం వచ్చే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా కరోనా నియంత్రణ చర్యలు చేపడతున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలు కనిపించిన వారికి మాత్రం వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ, కరోనా మహమ్మారి ఆర్టీపీసీఆర్ టెస్టులకు సైతం అంతు చిక్కడం లేదు.
జ్వరం, దగ్గు లక్షణాలున్న 40 ఏళ్ల ఓ వ్యక్తికి ఆర్టీపీసీఆర్ టెస్టు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. లక్షణాలను బట్టి కరోనా అని అనుమానించిన డాక్టర్లు ఇంటి వద్ద ఉంచి చికిత్స అందించారు. 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా పెరిగాయి. ఆయాసం ఎక్కువైంది. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నాడు. అందులోనూ నెగిటివ్ వచ్చింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయాయి. యాంటీజెన్ టెస్టులోనూ నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఛాతీ సీటీ స్కాన్ తీయించిన వైద్యులు.. కోవిడ్గా నిర్ధారించి, చికిత్స అందిస్తున్నారు.
అయితే, ఇటీవలి కాలంలో ఇటువంటి సంఘటనలు అనేకం నమోదవుతున్నాట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ కాకపోయినా.. లక్షణాలు మాత్రం కొనసాగుతుంటే.. మరింత లోతుగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆయాసం ఎక్కువగా ఉన్నా… రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.