
కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తు జరుపుతున్న తమ బృందాన్ని వూహాన్ సిటీలోకి అనుమతించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన డిమాండును చైనా తోసిపుచ్చింది. తాము కూడా కరోనా వైరస్ బాధితులమేనని, ‘దోషులం’ కామని పేర్కొంది. కరోనా వ్యాధిని ప్లేగు వ్యాధితో పోల్చిన ట్రంప్.. చైనా ధోరణి పట్ల తాను తీవ్ర అసంతృప్తి తో ఉన్నానన్నారు. వూహాన్ లోని ల్యాబ్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు తాము తహతహలాడుతున్నామన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్.. ఈ వైరస్ మానవాళికంతటికీ ఉమ్మడి శత్రువని అన్నారు. మేము కూడా దీని బారిన పడిన బాధితులమేనన్నారు. ఇతర దేశాల మాదిరే మేమూ ఈ వైరస్ కారణంగా బాధ పడుతున్నామని ఆయన చెప్పారు. కాగా అమెరికాలో 47 వేల మంది కరోనా రోగులు మృతి చెందగా.. ఏడు లక్షల మందికి పైగా ఇన్ఫెక్షన్లు సోకాయి.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 2, 428, 328 కరోనా కేసులు నమోదు కాగా.. 166, 130 మంది రోగులు మృతి చెందారు. 630. 907 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.