మరింత ఉధృతం కానున్న కరోనా.. సీడీసీ హెచ్చరిక..!
కరోనాపై ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. ఎలా అడ్డుకట్టవేయాలని దేశాధినేతల తలలు పట్టుకుంటున్నారు
కరోనాపై ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. ఎలా అడ్డుకట్టవేయాలని దేశాధినేతల తలలు పట్టుకుంటున్నారు. చాలా దేశాల్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు భయాందోళనల మధ్య బతుకుతున్నారు. కాగా ఈ ఏడాది చివరలో ఈ మహమ్మారి తీవ్రంగా విరుచుకుపడే అవకాశముందట. అమెరికాలో రానున్న శీతాకాలంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉండనుందని సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ డైరక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ హెచ్చరించారు.
అమెరికాలో ఇప్పటికే దాదాపు 8.24లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 45వేలకు పైగా మరణించారు. ఈ క్రమంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ రెడ్ఫీల్డ్ మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో అమెరికాలో ఒకవైపు ఫ్లూ మరోవైపు కరోనా వైరస్లు విజృంభిస్తాయని అన్నారు. తొలిదశలో కరోనా వైరస్ వ్యాప్తికి ఫ్లూ తోడై ఉంటే పరిస్థితి తట్టుకోవడం కష్టమయ్యేదని ఆయన తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఫ్లూ తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా వచ్చిందని వివరించారు. రానున్న శీతాకాలంలో ఇప్పటికంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని రెడ్ఫీల్డ్ హెచ్చరించారు.
Read This Story Also: మీ రాజకీయాలకు సమయమిది కాదు.. ఏపీ పొలిటికల్ లీడర్లకు బండ్ల క్లాస్..!