Corona alert : అక్కడ ఆరుబయటకు వచ్చారంటే..అంతే సంగతి !
వచ్చే 30 రోజుల్లో మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదున్నర లక్షలు వుంటుందని నిపుణుల అంచనా.
లాక్డౌన్ అమలులో ఉన్నా, భారత్ లో కరోనా వ్యాప్తి ఉదృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 67 వేలు దాటేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికి 67, 161కి చేరుకుంది. కరోనా కాటుకు బలైన వారి సంఖ్య రెండు వేల రెండు వందలు దాటేసింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,213 కాగా, .మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటి పోయింది. ఆ రాష్ట్రంలో కరోనా కాటుకు ఇంత వరకూ 779 మంది మరణించారు. అలాగే తమిళనాడులో కూడా కరోనా ఉధృతి ఆందోళన కర స్థాయిలో ఉంది. ఇక గుజరాత్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది.
గుజరాత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అహ్మదాబాద్లో పరిస్థితి భయానకంగా ఉంది. గుజరాత్లో మే 10న ఒక్క రోజే 398 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8195కు చేరుకుంది. గుజరాత్లో కరోనా కారణంగా ఇప్పటివరకు 493 మంది మరణించారు. ముఖ్యంగా అహ్మదాబాద్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో సుమారు 6 వేల కేసులు ఇక్కడే నమోదయ్యాయి. తాజాగా అధికారులు ఇక్కడ 334 మంది సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించారు.
అహ్మదాబాద్లో 14 వేల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఇప్పటికే వీరి వివరాలు సేకరించారు. మూడు రోజుల పాటు వారందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆరుబయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మే 15 వరకు అహ్మదాబాద్లో సరకులు, కూరగాయల దుకాణాలను మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు అధికారులు సమకూరుస్తున్నారు. సరుకుల కోసం వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, కిరాణా షాపుల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు.