‘ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థ బలపడినందుకా..?’.. CM రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలపడిందని, దేశవ్యాప్తంగా 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ వంటి సంక్షేమ పథకాలపై రాజీనామా చేయాలా అని ప్రశ్నించిన సీఎం.. "2034 వరకు నేనే సీఎం.. అప్పటి వరకు పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలి" అంటూ వ్యాఖ్యానించారు..

ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థ బలపడినందుకా..?.. CM రేవంత్‌ భావోద్వేగ వ్యాఖ్యలు
CM Revanth Defends Education Reforms in Telangana

Updated on: Jul 30, 2026 | 2:57 PM

హైదరాబాద్‌, జులై 30: రాష్ట్ర విద్యా వ్యవస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యా రంగంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించిన సీఎం రేవంత్‌, తన రాజీనామా కోరుతున్న ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గతంతో పోలిస్తే గణనీయంగా బలపడిందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో 28వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని తెలిపారు. ఈ పురోగతి ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితమని అన్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి సీఎం ప్రశ్నలు సంధించారు. ‘స్కూళ్లు నిర్మించినందుకు రాజీనామా చేయాలా? విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందిస్తున్నందుకు రాజీనామా చేయాలా?’ అంటూ ప్రశ్నించారు. విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శిస్తున్న వారు వాస్తవాలను గుర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా తన పదవీకాలంపై కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ‘2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. అప్పటి వరకు పిల్లల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలి. అదే మీ ప్రమాణంగా తీసుకోండి’ అని పిలుపునిచ్చారు. విద్యా రంగంపై తన నిబద్ధతను ప్రస్తావిస్తూ ‘స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా విద్యా వ్యవస్థ అభివృద్ధిపై అధ్యయనం చేయడానికి హార్వర్డ్‌కు కూడా వెళ్లాను’ అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలాన్ని ప్రస్తావించారు. ‘2024 జనవరి 1కు ముందు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చాయా? మీ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి’ అని ప్రశ్నించారు.

తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని పేర్కొన్న సీఎం రేవంత్‌.. మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తనకు బాగా తెలుసన్నారు. మేము వందల ఎకరాల కోసం పోరాడే వాళ్లు కాదు. టీవీ ఛానళ్ల కోసం, ఇంట్లో నిత్యావసరాల కోసం ఆలోచించే కుటుంబాలమని అన్నారు. మధ్యతరగతి కుటుంబాల్లోనే నిజమైన కుటుంబ బంధాలు ఉంటాయి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విద్య, సంక్షేమం, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us