
హైదరాబాద్, నవంబర్ 12: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (CSE 2025) మెయిన్ ఫలితాలు బుధవారం (నవంబర్ 12) విడుదలయ్యాయి. ఈ మేరకు మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే తుది దశ అయిన ఇంటర్వ్యూకి పిలుస్తారు. తాజా ఫలితాల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్ రౌండ్)కు ఎంపికయ్యారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి కలిపి మొత్తం వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ మార్కుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ అయితన గ్రూప్ ‘ఏ’ గ్రూప్ ‘బి’ వంటి పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే యూపీఎస్సీ ప్రకటించనుంది. ఇంటర్వ్యూలు న్యూఢిల్లీ షాజహాన్ రోడ్లోని ధోల్పూర్ హౌస్లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయి. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) షెడ్యూల్ తదనుగుణంగా అందుబాటులో ఉంచబడుతుంది. అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) యొక్క ఈ-సమ్మన్ లెటర్లు తగిన సమయంలో అందుబాటులో ఉంచబడతాయి, వీటిని కమిషన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను కమిషన్ ఎంపిక చేయనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.