
హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ ఫలితాలు మే 24 (శనివారం) విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 1,06,716 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 98,858 మంది పరీక్ష రాశారు. ఇందులో 83,364 (88.54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ఈసారి కూడా పాలీసెట్ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 45,773 మంది బాలికలకుగానూ ఏకంగా 40,528 అంటే 88.54 శాతం మంది బాలికలు అర్హత సాధించారు. ఇక 53,085 బాలురకు 42,836 అంటు 80.69 శాతం మంది అర్హత సాధించారు. మొత్తంగా పాలీసెట్లో 84.33 శాతం (83,364 మంది) విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 120 మార్కులకు పాలిసెట్ పరీక్ష నిర్వహించగా 36 మార్కులొస్తే క్వాలిఫై అయినట్టు పరిగణిస్తారు. కాగా మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ 2025 రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వివిధ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు. జూలైలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. తాజా ఫలితాల్లో టాప్ ర్యాంకులు అధికంగా బాలికలే సాధించారు. 120 మార్కులకు గానూ నలుగురు విద్యార్థులు 120 సాధించారు. గోరుగంటి శ్రీజ, తూమాటి లాస్యశ్రీ.. ఎంపీసీ, ఎంబైపీసీ రెండు గ్రూపుల్లోనూ 120కి 120 మార్కులు సాధించి సత్తా చాటారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.