
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ – DOST 2026-27 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి సోమవారం ఈ షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు మహిళా వర్సిటీ, జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో బి.ఏ, బి.ఎస్సీ, బి.కామ్ వంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుండి మే 7 వరకు కొనసాగనుంది. ఫేజ్-1 రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 200గా నిర్ణయించారు. ఏప్రిల్ 30 నుండి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఆ తర్వాత రెండో విడత రిజిస్ట్రేషన్లు ఫీజు రూ. 400 తో మే 15 నుండి 25 వరకు చేసుకోవాలి. మే 16 నుంచి 26 వరకు అన్ లైన్ వెబ్ ఆప్షన్ లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుంది. రెండో విడత సీట్ల కేటాయింపు మే 30 న నిర్వహిస్తారు.
మూడో విడత రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు జరుగుతాయి. మే 31 నుంచి జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. జూన్ 20 న మూడో విడత సీట్లు కేటాయిస్తారు.
ప్రతి విడతలోనూ ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లలో అవకాశం కల్పించనున్నారు. మూడు విడతల సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జూన్ 20 నుండి జూన్ 27 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30 తేదీల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 1, 2026 నుండి మొదటి సెమిస్టర్ తరగతులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.