
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) మరో తీపికబురు చెప్పింది. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 10 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 17, 2026వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆగస్టు 17వ తేదీ వరకు అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు బీఆర్క్/ బీఈ/ బీటెక్ (సివిల్) లేదా బీప్లానింగ్/ బీటెక్ (ప్లానింగ్) లేదా జాగ్రఫీ స్పెషలైజేషన్లో ఎంఏ లేదా ఎం.ఎస్సీ/ ఎంఎస్సీ జియోఇన్ఫర్మేటిక్స్, పీజీడీఎంలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీ/ దూరవిద్య ద్వారా చదివిన వారు తప్పనిసరిగా యూజీసీ/ ఏఐసీటీఈ/ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో చదివి ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధన మేరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠంగా ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులు/ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు మూడేళ్ల వరకు వయోసడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్ట్ 17, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ/ బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దీనితోపాటు పరీక్షా ఫీజు కింద రూ.120 కూడా చెల్లించాలి. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 వరకు జీతంగా చెల్లిస్తారు. రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఆఫ్లైన్ విధానంలో (పెన్, పేపర్ విధానం) ఉంటుంది. పరీక్ష హాల్ టికెట్లను పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష అక్టోబరు 2026లో ఉంటుంది.