
హైదరాబాద్, మే 18: తాజాగా విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిలుకానగర్ (ఉప్పల్)కు చెందిన ఎం రుషి 160కి 156 మార్కులతో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ టాపర్గా నిలిచాడు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ జిల్లా ఆసిఫ్నగర్కు చెందిన విద్యార్థి ముఖర్రమ్ అహ్మద్ 160కి 150 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాడు. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో టాప్ 10 ర్యాంకర్లలో ఏకంగా 8 మంది అబ్బాయిలు ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలోనూ టాప్ 10లో ఏడుగురు అబ్బాయిలుండగా, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఏపీకి చెందిన వారు కూడా టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అయితే వీరికి అడ్మిషన్లు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు.
ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలు 73.72 శాతం ఉత్తీర్ణత పొందగా, అబ్బాయిలు 73.10 శాతం మంది క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 0.62 శాతం అధికంగా అర్హత సాధించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో అమ్మాయిలు 86.76 శాతం, అబ్బాయిలు 84.70 శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇందులోనూ అమ్మాయిలు 2.06 శాతం అధికంగా అర్హత సాధించారు. మరోవైపు ఈసారి ఈఏపీసెట్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఇచ్చారు. ఇంజినీరింగ్లో 10వేల లోపు ర్యాంకు 62 మార్కులకే కటాఫ్ రావడం విశేషం. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 66 మార్కులకు 10లోపు ర్యాంకు కేటాయించారు. పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికి రెండు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటే రిజర్వేషన్ క్యాటగిరీతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.