
తెలంగాణలోని ఉపాధ్యాయ అభ్యర్థులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష జూన్-2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 14న పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 15 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీటెట్ కోసం అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. జూన్ 15 నుండి జూన్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 9 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్షా ఫలితాలు జూలై 28 నుండి 31 మధ్య ప్రకటించే అవకాశం ఉంది.
ఈసారి టీజీటెట్ పరీక్షను పేపర్-1, పేపర్-2గా నిర్వహిస్తున్నారు. ఒకటి నుండి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్-1, ఆరు నుండి ఎనిమిదో తరగతి వరకు బోధించే వారు పేపర్-2 రాయాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే.. జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఒక పేపర్కు రూ.700, రెండు పేపర్లకు రూ. 950 ఫీజు చెల్లించాలి. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు కూడా తమ స్కోర్ పెంచుకోవడానికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
టీజీటెట్ సర్టిఫికేట్ చెల్లుబాటు కాలపరిమితిని ప్రభుత్వం గతంలోనే జీవితకాలం పొడిగించింది. టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో టెట్ స్కోర్కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. డి.ఎల్.ఎడ్, బి.ఎడ్ పూర్తి చేసిన వారితో పాటు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు.