హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అన్ని సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం (మార్చి 25)తో ముగిశాయి. ప్రధాన సబ్జెక్టు పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమవగా మార్చి 25తో అన్ని పరీక్షలు ముగిశాయి. తొలుత కొన్ని ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడంతో హల్చల్ చేసినా… ఆ తర్వాత సజావుగానే పరీక్షలు జరిగాయి.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 విద్యార్థులు పరీక్షలు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. వీరిలో ఫస్టియర్లో విద్యార్థులు 4,88,448 మంది, సెకండియర్ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. ఇక గతంలో ఫెయిలైన విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల్లో అక్కడక్కడా కొందరు విద్యార్ధులు కాపీ కొడుతూ డీబార్ అయినప్పటికీ సింహభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఇక ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 సెంటర్లల్లో నిర్వహిస్తున్నారు. మార్చి 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. మూల్యాంకనం అనంతరం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేసే లక్ష్యంతో అధికారులున్నారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల ఆ పరీక్ష ప్రారంభానికి కనీసం రెండు మూడు రోజుల ముందుగానే ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది మార్చి 19వ తేదీకి పరీక్షలన్నీ పూర్తికాగా, ఏప్రిల్ 24న ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.