
హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులు రేపటితో ముగియనున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 23వ తేదీతో ఫీజు గడువు ముగిసింది. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు మే 4వ తేదీ వరకు ఈ గడువును పొడిగించింది. రూ. 3,000 ఆలస్య రుసుముతో మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఈ పొడిగింపు ఫస్ట్, సెకండ్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది.
ఇక ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21వ తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి మే 25 వరకు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు మరియు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుంచి, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష అదే రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జాం మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.