
హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ 2025 ఫలితాలు గురువారం (జూన్ 5) విడుదలయ్యాయి. ఈ పరీక్షను మే 25న ఆన్లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహించిన కేవలం 10 రోజుల్లోనే పరీక్ష ఫలితాలను అధికారులు వెల్లడించారు. తాజా ఫలితాల్లో 78.18 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,815 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 33,321 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,442 మంది అంటే 78.18 శాతం మంది అర్హత సాధించారు.
ఇక మీడియం వారీగా చూస్తే.. తెలుగు మీడియంలో 19,900 మంది విద్యార్థులకు 15,478 మంది పరీక్ష రాయగా.. వీరిలో 11,288 అంటే 72.79 శాతం మంది అర్హత సాధించారు. ఇంగ్లీష్ మీడియంలో 22,051 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 18,983 మంది పరీక్ష రాశారు. ఇందులో 14,848 అంటే 38,94 శాతం అర్హత సాధించారు. ఉర్దూ మీడియంలో 1,884 మంది దరఖాస్తు చేసుకుంటే 1,982 మంది పరీక్ష రాశారు. వీరిలో 530 మంది అర్హత సాధించారు. తాజాగా విడుదలైన డీఈఈ సెట్ ఫలితాల్లో.. 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత (తెలుగు మీడియం) స్టేట్ టాపర్గా నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో పసునూరి అభినవ రెడ్డి (87 మార్కులు), ఉర్దూ మీడియంలో ఫరాజ్ ఆహ్మద్లు (67 మార్కులు) టాపర్లుగా నిలిచారు.
తెలంగాణ డీఈఈ సెట్ 2025 రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 9 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు జూన్ 9 నుంచి 13 వరకు జరుగుతుంది. జూన్ 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50కి పైగా డైట్ కాలేజీల్లో 4000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.