
అమరావతి, ఏప్రిల్ 8: ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీచర్ల బదిలీలకు సంబంధించి కూటమి సర్కార్ ప్రత్యేక చట్టం తీసుకురాగా.. మొదటిసారిగా ఈ చట్టం ప్రకారం టీచర్ల బదిలీలు చేయబోతుంది. జీఓ-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానం తీసుకురాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించనున్నారు. ఈ మేరకు బదిలీలు కూడా చేపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ 95 శాతం పూర్తయింది. ఇంకా రాష్ట్రంలో 430 బడులకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఆ లెక్కన రాష్ట్రంలో మత్తం 7500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. వార్డు, గ్రామ పంచాయతీలకు ఒక్కో బడి చొప్పున ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ 30 నాటికి ముగిసేలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఏప్రిల్ 20 నాటికి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాటిని విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించారు. మరోసారి సరిచూసుకునేందుకు తుది జాబితాలను విడుదల చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారని అధికారులు చెబుతున్నారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత రానుంది. ప్రణాళిక మేరకు మే మొదటి వారంలో టీచర్ల బదిలీలకు ప్రకటన విడుదల చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలి.
ఒక్కో ఉపాధ్యాయులు ఎన్ని ఖాళీలకైనా ఐచ్ఛికాలు పెట్టుకునే సదుపాయం కల్పించారు. తద్వారా సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు మాత్రం తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారు తమకు నచ్చిన వాటితోపాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పాఠశాలను కూడా ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టి, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డీఎస్సీలో వచ్చే కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.