
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లోని హ్యూమన్ రీసోర్సెస్ విభాగం… దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్బీఓ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 41 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి తప్పనిసరిగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్ట్ 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.59 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష ప్రావీణ్యం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆన్లైన్ పరీక్ష తేదీ ఆగస్టు లేదా సెప్టెంబరు 2026లో ఉంటుంది.
రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు మొత్తం 150 మార్కులకు ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.