
హైదరాబాద్, డిసెంబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు పలు వినూత్న చర్యలు చేపట్టనుంది. విద్యార్థులు హాజరు, గైర్హాజరుల వివరాలను మాత్రమే ప్రతిరోజూ తల్లిదండ్రుల ఫోన్లకు సందేశాలు పంపిస్తున్న బోర్డు.. తాజాగా విద్యార్ధుల హాల్ టికెట్లను కూడా వారి ఫోన్లను పంపించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో 45 రోజుల నుంచి రెండు నెలల ముందే తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్కు వారి పిల్లల హాల్టికెట్లను పంపనున్నారు.
హాల్టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం వివరాలు, అలాగే ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుంది.. వంటి వివరాలు తల్లిదండ్రులకు తెలియజెప్పడమే దీని ప్రధాన ఉద్దేశమని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యార్ధుల్లో అధిక మంది తల్లిదండ్రుల వద్ద స్మార్ట్ ఫోన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సెకండ్ ఇయర్ హాల్టికెట్లపై మాత్రం ఫస్టియర్ మార్కుల లింక్ జారీ చేస్తారు. దీంతో విద్యార్ధులు ఫస్టియర్లో ఏ సబ్జెక్టుల్లో పాసయ్యారు? వేటిలో తప్పారో వంటి వివరాలు తల్లిదండ్రులు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ చదువుతున్న మొత్తం 10 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు పంపించనున్నారు. అలాగే ఈ సారి జరగబోయే పరీక్షలకు ప్రింటర్ నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకే ఇంటర్ ప్రశ్నాపత్రాలను తరలించనున్నారు. అలాగే ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలకు జీపీఎస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.