
హైదరాబాద్, మార్చి 12: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మార్చి 11 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపులకు అవకాశం ఇచ్చారు. ఇక ఈ రోజు నుంచి అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ కానుంది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ దరఖాస్తు ఫారమ్లో ఏవైనా తప్పులు దొర్లితే.. ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అవకాశం కల్పించింది.
నీట్ యూజీ అప్లికేషన్ సవరణకు మార్చి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇది మార్చి 14, 2026వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ గడువు ముగిసేలోపు దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వబోమని ఎన్టీయే స్పష్టం చేసింది. అయితే దరఖాస్తులో అభ్యర్ధి తండ్రి, తల్లి పేర్లు, విద్యార్హతలు, వృత్తి, పదో తరగతి – పన్నెండవ తరగతి విద్యా వివరాలు, కేటగిరీ, సబ్-కేటగిరీ, సంతకం, పరీక్ష రాసే నగరం, పరీక్ష మాధ్యమం, నీట్ అటెంప్ట్ నెంబర్, కేటగిరీ వంటి వివరాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డుతో కాకుండా ఇతర గుర్తింపు పత్రాలతో రిజిస్టర్ అయిన వారు తమ గుర్తింపు వివరాలను సైతం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇక నీట్ యూపీ 2026 పరీక్ష మే 3, 2026 (ఆదివారం) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్లైన్ విధానంలో (పెన్ను, పేపర్) జరగనుంది. పరీక్ష రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. నీట్ యూజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు.
https://neet.nta.nic.in/
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.