96 ఏళ్లకు పుస్తకం పట్టింది.. వందకు 98 మార్కులు సాధించింది! ఎవరీ బామ్మ..?

వయస్సు 96.. ఆ వయస్సులో ఎగ్జామ్ రాస్తే వందకు 98 మార్కులు వచ్చాయి. సాక్షారతా విద్యలో ఈ బామ్మ ఓ రికార్డ్ క్రియేటర్‌గా మారింది. ఇది కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ కథ. 2018లో కేరళలో పరీక్షా ఫలితాలు ప్రకటించినప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాసైన వాళ్లల్లో ఆనందం. సెకండ్ గ్రేడ్ లో పాసైనవారిలో ఇంకొంచెం మార్కులు తెచ్చుకుంటే బాగుండునేమోనన్న ఒకింత అసంతృప్తి. ఇక పాస్ అయినవారిలో హమ్మయ్య బతికి బట్ట కట్టామనే భావన.. ఫెయిల్ అయినవాళ్లల్లో నిరుత్సాహం ఇవన్నీ సర్వసాధారణంగానే కనిపించాయి. కానీ, అంతమందిలో ఒక బామ్మ స్టోరీ మాత్రం ప్రత్యేకంగా నిల్చింది. ఆమె మనం చెప్పుకుంటున్న కార్త్యాయని అమ్మ..

96 ఏళ్లకు పుస్తకం పట్టింది.. వందకు 98 మార్కులు సాధించింది! ఎవరీ బామ్మ..?
Karthiyani Amma Tops In Kerala Literacy Exam

Edited By:

Updated on: May 16, 2026 | 4:58 PM

కార్త్యాయని చిన్నప్పట్నుంచీ చదవుకోవాలన్న ఆసక్తి ఉన్నా.. విద్యావకాశాలకు దూరమైపోయింది. ఎందుకంటే పేదరికంలో పుట్టిన కార్త్యాయనికి చిన్ననాటే తండ్రి మరణం.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బడికెళ్లే అవకాశం లేకపోయింది. పనికి పోతేనేగానీ కుటుంబం గడిచే పరస్థితి. అందువల్ల 90ల వయస్సు వచ్చేవరకూ కూడా నిరక్షరాస్యురాలుగానే ఉండిపోయింది. కార్త్యాయని వంటివారి కోసం కేరళ ప్రభుత్వం సాక్షరతా మిషన్ ను ఆరంభించింది. అక్షర లక్ష్యమే ఆ మిషన్ లక్ష్యం. వయోజన సాక్షరతా మిషన్ లో చేరడంతో కార్త్యాయని బతుకుచిత్రం మారిపోయింది. తొంభై ఏళ్ల పై బడ్డ వయస్సులో ఏజ్ జస్ట్ ఒక నంబర్ గేమ్ మాత్రమేనంటూ.. దాన్ని డోంట్ కేర్ అంటూ ఆమె అక్షరజ్ఞానం వైపు అడుగులేసింది.

ఒకరి సాయం లేందే కదలలేని వయస్సులో వాలంటీర్స్, ఉపాధ్యాయులు ఆమె ఇంటికే వచ్చి చదువులు చెప్పేవారు. హరిపాడ్ లో ఆమె తన ఇంటివద్దే ప్రతీరోజూ చదవడం, రాయడం, ముఖ్యంగా గణితం అభ్యసించడంలో ఎంతో ఆసక్తి కనబర్చారు. ఆమె బంధువులు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయేవారు. తరగతులను మిస్సవ్వడం కూడా చాలా అరుదుగా జరిగేది. అంత క్రమం తప్పకుండా శ్రద్ధగా చదివింది తొమ్మిది పదుల కార్త్యాయని.

ఆశ్చర్యపర్చిన పరీక్షా ఫలితాలు!

కార్త్యాయని అమ్మ కేరళ రాష్ట్ర సాక్షరతా మిషన్ నిర్వహించిన పరీక్షలో వందకు 98 మార్కులు సాధించడంతో ఈమె విజయగాధ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. రాజకీయ నాయకులు, విద్యావేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. గత ముఖ్యమంత్రి పినరన్ విజయన్ అయితే కార్త్యాయనిని ప్రశంసిస్తూ నేటి సమాజానికి ప్రేరణగా పేర్కొన్నారు. కార్త్యాయని విజయం జీవితాంతం నేర్చుకునే నిత్య విద్యార్థిత్వం ఎలా ఉంటుందో ఈ సమాజానికి కళ్లకు గట్టింది. ఆ వయస్సులో కార్త్యాయని అమ్మలో చదువుకోవాలనే ఆసక్తి అందరినీ అబ్బురపర్చింది. కార్త్యాయని ఆసక్తి గమనించి సాక్షరతా మిషన్ అధికారుల బృందం ఆమెకు విద్య నేర్పించడంలో మరింత శ్రద్ధ, ఆసక్తి కనబర్చారు. స్వయంగా ఆమె పుస్తకాలు, వార్తా పత్రికలు చదివేలా ఆమెకు చదువు చెప్పి ప్రోత్సహించారు. 2023లో తన నూటా ఒక్కటో ఏడులో కన్నుమూసిన ఈ కార్త్యాయని అమ్మ లైఫ్ స్టోరీ ఇప్పుడు కేరళలో అమలవుతున్న వయోజన సాక్షరతా మిషన్ కార్యక్రమాల్లో ఓ లెస్సన్ గా మారింది.

Follow Us