
హైదరాబాద్, జనవరి 2: దేశవ్యాప్తంగా ఉన్నఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్ పరీక్షకు దేశ వ్యాప్తంగా ఏకంగా 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంటే గత ఏడాది జనవరి సెషన్ కంటే దాదాపు లక్షకుపైగా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రెండు సార్లు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రెండు సెషన్లకు కలిపి 24 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇంజినీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తుంది. గత మూడేళ్లతో పోలిస్తే 2026 జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయని చెప్పవచ్చు.
2025లో తొలి సెషన్కు 13.80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. ఇందులో 96 శాతం మంది పరీక్షలకు కూడా హాజరవుతున్నారు. అంటే ఈసారి జేఈఈ మెయిన్ రెండు సెషన్లకు కలిపి భారీగా పోటీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక మొదటి సెషన్ పరీక్షలు జనవరిలో 21 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్టీఏ షెడ్యూల్ కూడా జారీ చేసింది. ఈ వారంలో సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేయనుంది. జనవరి మూడో వారంలో అంటే పరీక్షకు 4 రోజుల ముందు జనవరి 18 నుంచి అడ్మిట్ కార్డులు వెలువడతాయన్నమాట.
JEE మెయిన్ 2026 పరీక్ష మన దేశంతోపాటు విదేశాలలోనూ బహుళ పరీక్షకేంద్రాలలో ఆన్లైన్ విధానంలో (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షకు రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. BE/B.Tech ప్రవేశాల కోసం పేపర్ 1, బిఆర్క్, బిప్లానింగ్ కోర్సులకు పేపర్ 2 పరీక్ష రాయవల్సి ఉంటుంది. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష 300 మార్కులకు, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది. జేఈ మెయిన్ తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12 నాటికి వెల్లడిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.