
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్స్టిట్యూట్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షల నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమవగా.. నవంబర్ 27 వరకు కొనసాగనున్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-2026 పరీక్ష మొత్తం 2 పేపర్లకు జరుగుతుంది. పేపర్ 1 బీఈ/బీటెక్ కోర్సులకు, పేపర్ 2 ఏ బీఆర్క్ (బ్యాచిలర్ ఆఫ్ అర్కిటెక్చర్), పేపర్ 2 బి బీప్లానింగ్ (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్) కోర్సులు నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి లేదు. అంటే ఎవరైనా ఈ పరీక్షలు రాయొచ్చన్నమాట. అయితే 2024, 2025లో 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2026లో 12వ తరగతి/ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా జేఈఈ (మెయిన్) 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 27, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ కేటగిరీలో పురుషులు రూ.1000, మహిళలు రూ.800 చొప్పున చెల్లించాలి. అలాగే ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పురుషులు రూ.900, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
కాగా దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్లో చేరాలంటే జేఈఈ మెయిన్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ కూడా రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్లో ర్యాంకులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి. దేశవ్యాప్తంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో, జీఎఫ్టీఐల్లో 25 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీటెక్ సీట్లకు పేపర్ 1 పరీక్ష, బీఆర్క్, బీ ప్లానింగ్లో ప్రవేశాలకు పేపర్ 2 రాయవల్సి ఉంటుంది.
పేపర్ 1 పరీక్ష మొత్తం 300 మార్కులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి 90 ప్రశ్నలు వస్తాయి. 3 గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. పేపర్ 2ఏలో 400 మార్కులకు గణితం, ఆప్టీట్యూడ్, డ్రాయింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇక పేపర్ 2బి- బీప్లానింగ్ పేపర్లో 400 మార్కులకు గణితం, ఆప్టీట్యూడ్, ప్లానింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్ష కూడా 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండు సెక్షన్లలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మొత్తం 13 భాషల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య జరుగుతాయి. ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
జేఈఈ మెయిన్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.