
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఈపోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్లో 1215, తెలంగాణలో 519 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎవరైనా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. అయితే మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా సబ్జెక్టులుగా చదివి ఉండాలి. వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. సైకిల్ తొక్కటం కూడా వచ్చి ఉండాలి. అభ్యర్ధుల 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో మార్చి 3, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లింపులు ఉండవు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకైతే రూ.12000 నుంచి రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన వారిని ఖాళీగా ఉన్న బ్రాంచీలు, హోదా ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
తపాలా శాఖలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.