
అమరావతి, జులై 29: ఏపీ హైకోర్టు లోకల్ కోటాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి, నీట్ రాసిన పలువురు అభ్యర్థులు తమకు కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై జులై 28న హైకోర్టు విచారించింది. గుంటూరుకు చెందిన ఎస్కే కమరుద్దీన్, శ్రీకాకుళంకు చెందిన సనపల వెంకటరమణతోపాటు మరో 51 మంది నీట్ అభ్యర్థులు సోమవారం హైకోర్టులో ఈ వ్యాజ్యాలు వేశారు.
పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పదో తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఇంటర్ తెలంగాణలో పిటిషన్ వేసిన విద్యార్ధులు చదివారని, కానీ వారి తల్లిదండ్రులు మాత్రం ఏపీలోనే నివసిస్తున్నట్లు తెలిపారు. వారి ఆధార్, నివాస ధ్రువపత్రాలు కూడా ఏపీకి చెందినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీలో నివసిస్తున్నా.. ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివారన్న ఒక్క కారణంతో నాన్లోకల్గా పరిగణిస్తున్నట్లు వాదనలు వినిపించారు. అయితే నీట్ పరీక్ష రాసేనాటికి విద్యార్థులు వరుసగా నాలుగేళ్లు ఏపీలోనే చదివి ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల సారాశం. దీనిని బట్టి చూస్తే సదరు విద్యార్ధులు నాన్లోకల్ కోటాకిందకు వస్తారని ఎన్టీర్ విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపించారు.
ఇరువురి వాదనలు విన్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువడిస్తూ పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులను స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే లోకల్, నాన్లోకల్ వ్యవహారంపై లోతుగా విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.