
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నిరుద్యోగ యువత నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం భారీ రిక్రూట్మెంట్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా జాబ్ క్యాలెండర్ 2026ను ప్రకటించింది. మొత్తం 10,060 సర్కారీ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం మొత్తం నాలుగు విడతల్లో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నియామకాలలో పోటీ పరీక్షల అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్స్, డీఎస్సీలకు ప్రాధాన్యం దక్కింది. పరిపాలనా విభాగంలో కీలకమైన గ్రూప్-1 కేటగిరీలో 149, గ్రూప్ 2 విభాగంలో 673 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరోవైపు విద్యాశాఖలో డీఎస్సీ ద్వారా 2,991 టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. వీటితో పాటే నిరుద్యోగుల కలల కొలువైన పోలీస్, ఫైర్, ఎక్సైజ్ విభాగాలతో పాటు అటవీ, పశుసంవర్ధక, విద్యుత్, ఇంజినీరింగ్, జైళ్ల శాఖల్లోని ఖాళీలను సైతం దశలవారీగా భర్తీ చేయనున్నారు.
జాబ్ క్యాలెండర్ ప్రకారం.. తొలి విడత కింద ఉన్నత విద్యాశాఖకు చెందిన 1,523 పోస్టుల కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఇక మలి విడత కింద గ్రూప్ 1, పోలీస్ విభాగాలతో పాటు అటవీ, పశుసంవర్ధక శాఖలకు చెందిన 3,231 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ వెలువడనుంది.
అక్టోబర్ 15వ తేదీ అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారనుంది. అదే రోజున మూడో విడతలో భాగంగా గ్రూప్-2, విద్యుత్, ఇంజినీరింగ్, ఎక్సైజ్ శాఖల్లోని 2,311 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్, అలాగే నాలుగో విడత కింద 2,995 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రతిష్టాత్మక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నిర్దేశిత గడువులోగా నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.