
న్యూఢిల్లీ, మార్చి 9: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 తుది ఫలితాలు గత శుక్రవారం (మార్చి 6) విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 958 మంది అభ్యర్ధులు అఖిల భారత సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. అయితే తాజా ఫలితాల్లో ఒక ర్యాంక్ రెండు రాష్ట్రాల మధ్య గందరగోళాన్ని సృష్టించింది. ఆకాంక్ష సింగ్ అనే పేరు గల ఇద్దరు యువతులకు ఒకే ర్యాంకు రావడం వివాదానికి దారితీసింది. ఈ ఇద్దరు యువతులు తమకు 301 ర్యాంక్ వచ్చిందని ఎవరికి వారు ప్రకటించుకోవడమే ఇందుకు కారణం. వీరి ఇద్దరి రోల్ నంబర్ కూడా ఒకటే కావడంతో అసలు ఎవరో.. నకిలీ ఎవరో.. గుర్తించలేక తికమకపడుతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే వారణాసి (యూపీ) నుంచి ఒకరు, అర్రాహ్ (బీహార్) నుంచి మరొకరు 301 ర్యాంకు సాధించామని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు.
వీరిద్దరి పేర్లు ఆకాంక్ష సింగ్ కావడం, వీరి రోల్ నంబర్లు కూడా ఒకటే కావడంతో చర్చకు దారి తీసింది. ఇందులో వారణాసి అభ్యర్థిని తన యూపీఎస్సీ అడ్మిట్ కార్డ్, ఇంటర్యూ కాల్ లెటర్ను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫలితాల్లో ఇచ్చిన రోల్ నంబర్, ర్యాంక్ తనదేనని చెప్పారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు ఒకే రోల్ నంబర్ 0856794 కలిగిన అడ్మిట్ కార్డులను కలిగి ఉండటంతో ఈ వ్యవహారం మరింత గందరగోళంగా మారింది.
మరోవైపు బీహార్కు చెందిన ఆకాంక్ష సింగ్ 0856794 రోల్ నంబర్ ఉన్న అడ్మిట్ కార్డులోని బార్కోడ్ వేరే నంబర్ 0856569 ఉంది. ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ షేర్ చేసిన అడ్మిట్ కార్డులో రోల్ నంబర్, బార్కోడ్ నంబర్ రెండూ సరిపోలి 0856794గా ఉంది. ఈ వ్యత్యాసం గుర్తించిన నెటిజన్లు చర్చలు తీవ్ర స్థాయికి చేరాయి. మరోవైపు జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పరీక్షలో ఒకే రోల్ నంబర్తో ఇద్దరికి ఒకే ర్యాంక్ ఎలా వస్తుందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.