
మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తుంటే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అదేంటంటే.. యెస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నియమాలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, ట్రాన్స్పోర్ట్ లావాదేవీలు, థర్డ్ పార్టీ డిజిటల్ వాలెట్లలో డబ్బు లోడ్ చేసే విధానానికి సంబంధించిన పరిమితులను బ్యాంక్ సవరించింది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో విద్యుత్, నీరు, గ్యాస్, ఇంటర్నెట్ వంటి బిల్లులను చెల్లించినప్పుడు ఆ ఛార్జీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో యుటిలిటీ సర్వీస్ ట్రాన్సాక్షన్ ఫీగా కనిపిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ ఛార్జీ వర్తించే ఖర్చు పరిమితిని బ్యాంక్ పెంచింది.
యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్పై యుటిలిటీ ఖర్చు పరిమితిని ఇప్పుడు రూ.1 లక్షకు పెంచారు. ఇది గతంలో రూ.50,000 మాత్రమే. మార్క్యూ లేదా రిజర్వ్ క్రెడిట్ కార్డులపై ఈ పరిమితిని రూ.50,000గా నిర్ణయించారు, ఇది ముందు రూ.25,000గా ఉండేది. ఇతర రిటైల్ క్రెడిట్ కార్డులపై ఖర్చు పరిమితిని రూ.25,000గా పెంచారు. ఇది ముందుగా రూ.15,000గా ఉండేది. టోల్ ప్లాజాలపై చెల్లించే మొత్తాలు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలుగా కనిపిస్తాయి. ఈ విభాగంలో కూడా బ్యాంక్ ఖర్చు పరిమితిని పెంచింది. యెస్ ప్రైవేట్, మార్క్యూ, రిజర్వ్ క్రెడిట్ కార్డులపై ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పరిమితి ఇప్పుడు రూ.75,000గా ఉంది. ఇది గతంలో రూ.50,000. ఇతర రిటైల్ క్రెడిట్ కార్డులపై ఈ పరిమితి రూ.50,000గా నిర్ణయించారు. ఇది ముందు రూ.25,000గా ఉండేది.
యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా థర్డ్ పార్టీ డిజిటల్ వాలెట్లలో డబ్బు లోడ్ చేయడంపై కూడా కొత్త నియమాలు అమలు చేయనుంది. అమెజాన్ పే, పేటీఎం, మొబిక్విక్ వంటి ప్లాట్ఫామ్లలో డబ్బు లోడ్ చేస్తే రూ.2,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. అయితే రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి 1 శాతం ఛార్జీ వసూలు చేస్తారు. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే ఛార్జీ విధించబడుతుంది. ఈ మార్పులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, యెస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి