
మన దేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, సాంప్రదాయం, అన్నింటికీ మించి ఒక సురక్షితమైన పెట్టుబడి. ధర పెరిగినా, తగ్గినా భారతీయులు బంగారం కొనడం ఎప్పుడూ ఆపరు. అయితే పెట్టుబడి కోసం బంగారం కొనేవారికి ఐసీఐసీఐ బ్యాంక్ ఒక సంచలన అంచనాను విడుదల చేసింది. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా మార్కెట్ విశ్లేషణలు.
ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక ప్రకారం.. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరనున్నాయి.
2026 అంచనా: ఈ ఏడాది చివరకు 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల నుండి రూ. 1.80 లక్షల మధ్య ఉండవచ్చు.
2027 అంచనా: వచ్చే ఏడాది ఈ ధర మరింత పెరిగి, 10 గ్రాములకు రూ.1.60 లక్షల నుండి రూ. 1.90 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిరంతరం పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది ఇప్పటికే దేశీయ మార్కెట్లో బంగారం ధర సుమారు 20శాతం పెరిగింది. దీని వెనుక కొన్ని కీలక సమీకరణాలు ఉన్నాయి..
బలహీనపడుతున్న రూపాయి: అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల వల్ల ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 7శాతం తగ్గింది. 2026లో డాలర్తో పోలిస్తే రూపాయి సగటు మారకం రేటు రూ.96గా, 2027 నాటికి రూ.96.50గా ఉండవచ్చని అంచనా.
అంతర్జాతీయ ధరల సెగ: అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం సగటు ధర 4,700 డాలర్ల మార్కును తాకే అవకాశం ఉంది.
కస్టమ్స్ సుంకం భారం: కేంద్ర ప్రభుత్వం 2026 మే 13 నుండి అమల్లోకి వచ్చేలా బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6శాతం నుండి 15శాతానికి పెంచింది. దీని పూర్తి ప్రభావం ఇంకా మార్కెట్పై పడలేదు. దీనివల్ల రాబోయే రోజుల్లో ధరలు అదనంగా 2-3శాతానికి పెరిగే ఛాన్స్ ఉంది.
నివేదిక ప్రకారం.. 2025లో 65శాతం భారీ పెరుగుదల తర్వాత 2026లో అంతర్జాతీయ పసిడి ధరలు కేవలం 5శాతం మాత్రమే పెరిగాయి. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 28న పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ప్రారంభమైన తర్వాత, యూఎస్ డాలర్ బలోపేతం కావడంతో బంగారం ధరలు సుమారు 15శాతానికి తగ్గాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం… 2026 మొదటి త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ శాతం తగ్గింది. పెట్టుబడి డిమాండ్ 5శాతానికి తగ్గింది. సామాన్యుల కొనుగోళ్లు తగ్గినా, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల బంగారు కొనుగోళ్లు 2శాతం పెరిగాయి. దీనివల్ల మొత్తం గోల్డ్ డిమాండ్ 2శాతం పెరిగి, దీర్ఘకాలంలో బంగారానికి ఉన్న క్రేజ్ చెక్కుచెదరలేదని నిరూపితమవుతోంది.
ఐసిఐసిఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదికను బట్టి చూస్తే, స్వల్పకాలంలో మార్కెట్ ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. రాబోయే రెండేళ్లలో బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. తులం బంగారం రూ. 1.90 లక్షల మార్కుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఆభరణాలు కొనాలనుకునే వారైనా లేదా భవిష్యత్తు కోసం పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారైనా ప్రస్తుత మార్కెట్ ధరల తగ్గుదలను ఒక మంచి అవకాశంగా మార్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.