
భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు అందరి చూపు ఎయిర్ కండిషనర్ల వైపు మళ్లింది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? మనం వాడుతున్న ఏసీల్లో ఉష్ణోగ్రతను కనిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు లేదా గరిష్టంగా 30 డిగ్రీల కంటే ఎక్కువకు సెట్ చేయలేం. ఇది కేవలం కంపెనీలు పెట్టిన రూల్ అనుకుంటే పొరపాటే.. దీని వెనుక బలమైన శాస్త్రీయ, సాంకేతిక కారణాలు ఉన్నాయి. ఏసీ ప్రధాన విధి గదిలోని వేడి గాలిని పీల్చుకుని, కంప్రెసర్, రిఫ్రిజెరెంట్ సహాయంతో చల్లటి గాలిని బయటకు వదలడం. మనం ఉష్ణోగ్రతను మరీ ఎక్కువగా తగ్గించడానికి ప్రయత్నిస్తే, కంప్రెసర్పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది యంత్రం యొక్క పనితీరును దెబ్బతీస్తుంది.
ఏసీని 16 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేయనిస్తే, ఇండోర్ యూనిట్లోని కూలింగ్ కాయిల్స్పై మంచు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనివల్ల గాలి ప్రసరణ ఆగిపోయి, ఏసీ సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, యూనిట్ పూర్తిగా పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే తయారీదారులు 16 డిగ్రీలను సేఫ్టీ లిమిట్గా నిర్ణయించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మానవ శరీరానికి 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. 16 డిగ్రీల కంటే తక్కువకు వెళ్తే అది తీవ్రమైన చలికి దారితీసి జలుబు, ఫ్లూ, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే, 30 డిగ్రీల కంటే ఎక్కువ సెట్ చేస్తే.. ఏసీ ఉండీ లేనట్టే, ఎందుకంటే బయట సాధారణ ఉష్ణోగ్రత కూడా దాదాపు అంతే ఉంటుంది.
ఏసీ టెంపరేచర్ 16 డిగ్రీల కంటే తక్కువ సెట్ చేసే అవకాశం ఉంటే, విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరుగుతుంది. ఉష్ణోగ్రత ప్రతి డిగ్రీ తగ్గించే కొద్దీ సుమారు 6 శాతం అదనపు విద్యుత్ ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే 16 కంటే తక్కువకు వెళ్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.
భారత ప్రభుత్వం, BEE మార్గదర్శకాల ప్రకారం, ఏసీ తయారీదారులు డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచాలని సూచిస్తున్నాయి. ఇది విద్యుత్ పొదుపుకు మరియు పర్యావరణానికి మేలు చేస్తుంది. ఈ 16-30 డిగ్రీల పరిధి అనేది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం అత్యంత సమతుల్యమైన మరియు సురక్షితమైన ప్రమాణం.