
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం సమగ్ర మోటార్ బీమా పాలసీ కింద ఉంటేనే ఇది సాధ్యమని బీమా నిపుణులు చెబుతున్నారు. కేవలం తప్పనిసరి అయిన థర్డ్ పార్టీ బీమాపై ఆధారపడే యజమానులు తమ సొంత వాహనానికి జరిగిన నష్టానికి పరిహారం ఆశించకూడదు. వరదలు, భారీ వర్షాలు, నీరు నిలవడం, ఇతర రుతుపవన సంబంధిత సంఘటనల వల్ల కలిగే నష్టాల నుండి వాహనాన్ని రక్షించుకోవడానికి సమగ్ర పాలసీ కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాథమిక థర్డ్ పార్టీ పాలసీ, యజమాని సొంత కారుకు జరిగే నష్టానికి ఎలాంటి రక్షణను అందించదని చెబుతున్నారు. సమగ్ర మోటార్ ఇన్సూరెన్స్ సాధారణంగా వరదలు, నీరు నిలవడం, కొండచరియలు విరిగిపడటం, పార్క్ చేసిన వాహనాలపై చెట్లు పడటం వంటి సంఘటనల వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.
వెహికల్ ఇన్యూరెన్స్ పాలసీలు వరదలు, ముంపు, కొండచరియలు విరిగిపడటం, రాళ్లు విరిగిపడటం వంటి బీమా ప్రమాదాల కింద ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేస్తాయని, తద్వారా వాహనం దెబ్బతిన్నట్లయితే రిజిస్టర్డ్ యజమానులు నష్టపరిహారం కోరేందుకు వీలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వరదల తర్వాతే తరచుగా అతిపెద్ద నష్టం జరుగుతుంది. లోతైన నీటిలో ఆగిపోయిన వాహనాన్ని తిరిగి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇంజన్లోకి నీరు చేరి, యజమాని దానిని తిరిగి స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే, దానివల్ల కలిగే ఇంజన్ నష్టాన్ని సాధారణ కాంప్రహెన్సివ్ పాలసీ కింద పర్యవసాన నష్టంగా పరిగణిస్తారు. వాహనానికి ఇంజన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ లేకపోతే బీమా సంస్థ క్లెయిమ్లోని ఆ భాగాన్ని తిరస్కరించవచ్చు. నీటిలో మునిగిపోయిన లేదా తీవ్రంగా నీరు నిలిచిపోయిన వాహనాలను స్టార్ట్ చేయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలా చేయడం వల్ల ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని, దానికి బేస్ పాలసీ కింద కవరేజీ లభించకపోవచ్చని అంటున్నారు.