
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఉడాన్ యాత్రి కేఫ్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకారం ప్రస్తుతం ఈ కేఫ్లు దేశంలోని 24 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. విమానాశ్రయాల్లో ఆహార ధరలు అధికంగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఉడాన్ యాత్రి కేఫ్ ద్వారా టీ రూ.10కి, కాఫీ రూ.20కి, సమోసాలు, స్వీట్లు ఒక్కొక్కటి రూ.20 వంటి సరసమైన ధరలకు అందిస్తున్నారు. ఈ విధంగా తక్కువ ధరల్లో ఆహారం అందించడం ద్వారా సాధారణ ప్రయాణికులకు కూడా విమాన ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, లక్నో, జైపూర్, అగర్తలా, గ్వాలియర్, వారణాసి, అమృత్సర్, ఇండోర్, జమ్మూ, పాట్నా, చండీగఢ్, రాజ్కోట్, మంగళూరు, త్రివేండ్రం, కోయంబత్తూరు, భువనేశ్వర్, ముంబై, సూరత్, పూణే, అహ్మదాబాద్, హోలోంగి, విజయవాడ, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ఈ కేఫ్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణీకుల కేంద్రీకృత విధానాల భాగంగా ఈ కార్యక్రమాన్ని వేగంగా విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విమాన ప్రయాణాన్ని అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ప్రయాణ ఖర్చులను తగ్గించడంలో కూడా ఈ చర్య కీలకంగా మారనుంది. మొత్తానికి ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభంతో విమానాశ్రయాల్లో అధిక ధరల సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని విమానాశ్రయాలకు ఈ సేవలను విస్తరించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి