
ప్రజలు సురక్షిత పెట్టుబడి పథకాలుగా భావించే వాటిల్లో ప్రథమ స్థానంలో ఉండేది ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ). ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకు ప్రధాన కారణం దీనిలో పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముపై పన్ను మినహాయింపుతో పాటు కచ్చితమైన రాబడి వస్తుండటమే. అయితే దీనిపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఊహగానాలు ఇటీవల బాగా వినిపించాయి. అందుకోసం చాలా మంది డిపాజిట్లు వేయకుండా వేచి ఉన్నారు. ఎందుకంటే ఆర్బీఐ రెపో రేటు కనీసం 25 బేస్ పెంచుతుందని అంతా భావించారు. అయితే 2023 ఏప్రిల్ ఆరో తేదీని జరిగిన మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటును యథాతధంగా ఉంచింది. దీంతో ఎఫ్ డీ ల వడ్డీ రేటు మళ్లీ పెరిగే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎఫ్ డీ తీసుకోవడం మంచిదేనా? ఇప్పుడున్న వడ్డీ ఎంత? మళ్లీ వడ్డీ పెరిగే అవకాశం ఉందా? సీనియర్ సిటిజెన్స్ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పన్ను ప్రయోజనాలు, కచ్చితమైన రిటర్న్లు ఎఫ్ డీలను అత్యంత ప్రజాదరణ పొందేలా చేశాయి. పన్ను ఆదా చేసే ఎఫ్ డీలు ప్రీ మెచ్యూర్ విత్ డ్రాలకు అనుమతించవు. వీటిల్లో చెల్లిపులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన ఉంటాయి. ఒకవేళ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ను ఎంచుకుంటే, లాక్-ఇన్ పీరియడ్ ముగింపులో వడ్డీతో పాటు మొత్తం ప్రయోజనం ఉంటుంది.
రెగ్యులర్, గ్యారెంటీ ఆదాయాన్ని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఆప్షనే. ఇవి ఫిక్స్డ్ గ్యారెంటీ రిటర్న్ను అందిస్తాయి. ఇవి ప్రస్తుతం ఐదు సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ తో వస్తున్నాయి. చాలా బ్యాంకుల్లో 7-7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క 7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఆదాయ పన్ను పరిధిలో ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ ఎఫ్ డీలపై సంపాదించే మొత్తానికి వారి పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుందని గుర్తుంచుకోవాలి. మీరు ఒకవేళ అత్యధిక పన్ను పరిధిలోకి వస్తే, ఈ ఎఫ్ డీల నుండి వచ్చే వాస్తవ రాబడి తక్కువగా ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడి కోసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు పన్ను అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పన్ను పరిధిలోకి రాని సీనియర్లకు, ఫిక్స్డ్ డిపాజిట్ ప్రయోజనకరమే కానీ.. 30 శాతం ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి మాత్రం ఎఫ్డీ మంచి ఎంపిక కాకపోవచ్చు. పన్ను ఆదా కోసం సెక్షన్ 80సీ ప్రయోజనాన్ని పొందడానికి పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న ఈ ఎఫ్డీలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ కొత్త పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉండదు.
పన్ను పరిధిలోకి వచ్చే సీనియర్ సిటిజెన్స్ కు లాక్-ఇన్ వ్యవధి తక్కువగా ఉన్న ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్లలో (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడి పెట్టడాన్ని మంచి ఎంపికగా పరిగణించవచ్చు. లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్(ఎల్టీసీజీ) కింద రాబడిని పొందవచ్చు. ఇక్కడ రూ. 1 లక్ష వరకు పన్ను విధించబడదు. అంతకు మించితే పన్ను పదిశాతం మాత్రమే పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..