
పీఎఫ్ అనేది ప్రతి ఉద్యోగికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఉద్యోగం చేసే సమయంలో నెలవారీ కొంత మొత్తాన్ని దీనిలో జమచేస్తారు. ఉద్యోగ విరమణ అనంతరం పెద్ద మొత్తంలో ఆ ఉద్యోగికి అందజేస్తారు. మరి ఆ ఉద్యోగి కి రిటైర్మెంట్ కు ముందు అనుకోని ఖర్చులు వస్తే పరిస్థితి ఏమిటి, అతడి అవసరం ఎలా తీరుతుంది. దీని కోసమే అత్యవసర సమయంలో పీఎఫ్ నుంచి డబ్బులను విత్ర్ డ్రా చేసుకునే వీలుంది. దాని ప్రకారం ఉద్యోగి తన డబ్బులను విత్ డ్రా చేసుకుని, అత్యవసర ఖర్చులకు వాడుకోవచ్చు.
ఉద్యోగి తన అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ముందుగా కారణాన్ని వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. దీనినే క్లయిమ్ చేయడం అంటారు. ఆ దరఖాస్తును పరిశీలించి, నిబంధనల మేరకు డబ్బులను అతడి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. ఇదంతా జరగడానికి కొంత సమయం (సుమారు 15 రోజుల నుంచి నెల) పడుతుంది. దానిని ఇప్పుడు వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ ఓ చర్యలు తీసుకుంది. కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే సెటిల్ చేయనుంది. దీనిలో భాగంగా ఆటో సెటిల్ మెంట్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
వైద్యం ఖర్చుల కోసం చేసుకున్న క్లయిమ్ (రూల్ 68జే) లపై ఈపీఎఫ్ ఓ కొన్ని మార్పులు చేసింది. ఆ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. విద్య, వివాహం (రూల్ 68కే), ఇళ్ల నిర్మాణానికి (రూల్ 68బి) సంబంధించి కూడా రూ.లక్ష పొందే అవకాశం కల్పించింది. ఆటో సెటిల్ మెంట్ విధానంలో వీటిని వేగంగా పొందే అవకాశం ఉంది.
ఖాతాల క్లయిమ్ సెటిల్ మెంట్ లను వేగవంతంగా చేసి, వారి అవసరానికి ఉపయోగపడేలా వేగవంతంగా డబ్బులు ఇవ్వడానికి ఈపీఎఫ్ వో తీసుకువచ్చిన విధానమే ఆటో సెటిల్ మెంట్. మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా క్లయిమ్ పరిష్కారమవుతుంది. వైద్యం, ఉన్నత విద్య, విహహం, ఇల్లు కొనుగోలు కోసం ఉపయోగించుకోవచ్చు.
ఇలాంటి క్లయిమ్ ల సెటిల్ మెంట్ అత్యంగా వేగంగా జరగనుంది. ఆటో సెటిల్ మెంట్ విధానంలో చాలా సులభంగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానంలో మానవ ప్రమేయం ఉండదు. కేవైసీ, బ్యాంక్ లింక్ అన్ని సక్రమంగా ఉంటే కేవలం 3 నుంచి 4 రోజుల్లో డబ్బులు అందుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..