
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో పారదర్శకతను పెంచేందుకు, వాహనదారులకు సేవలను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలను చేపట్టింది. సోమవారం హైదరాబాద్లోని వరుణ్ మోటార్స్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ స్థాయి వాహన డేటాబేస్ ‘వాహన్’ (Vahan) పోర్టల్ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వాహనదారులకు మేలు చేకూర్చే పలు కీలక ప్రకటనలు చేశారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:
రాష్ట్రంలోని వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపి కబురు అందించారు. ఇప్పటివరకు ఒక వ్యక్తి తన పేరు మీద రెండో లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేస్తే చెల్లించాల్సిన 2% అదనపు లైఫ్ టైమ్ టాక్స్ను (Lifetime Tax) ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు, ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
తెలంగాణ రవాణా వ్యవస్థను జాతీయ వాహన డేటాబేస్తో అనుసంధానించడం ఒక చారిత్రాత్మక సంస్కరణ అని మంత్రి అభివర్ణించారు.
వాహనదారుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ల కోసం రవాణా కార్యాలయాల (RTO) చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొత్త వాహనం కొనుగోలు చేసిన ఆటోమొబైల్ షోరూమ్లోనే నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పారదర్శక చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణను ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో జాతీయ స్థాయి డిజిటల్ విధానాలను తెలంగాణ వేగంగా అందిపుచ్చుకుంటోందని తెలిపారు. సాంకేతిక సమస్యలు లేకుండా ఆన్లైన్ సేవలను ప్రజలకు చేరవేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు
ప్రతిరోజూ రాష్ట్రంలో సుమారు 1,500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్న నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను వాడటం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు పన్ను రద్దు, డిజిటల్ పోర్టల్స్ ప్రారంభం వంటి చర్యలతో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త పుంతలు తొక్కుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి