Telugu News Business Smooth Rides Ahead: Indian Railways to Deploy AI and Composite Sleepers for Shink Free Travel
Indian Railways: ఇక రైలు ప్రయాణంలో కుదుపులకు చెక్! ప్రయాణం సాఫీగా.. ఆ శబ్దం ఉండదు!
Railway Smart Tracks: భారత రైల్వే ఇక సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను ముందే నివారించవచ్చు. అంతేకాకుండా, ట్రాక్ సమస్యల వల్ల రైళ్లు ఆలస్యంగా నడిచే పరిస్థితి తగ్గి, ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది.
Railway Smart Tracks: వేగంగా వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా కుదుపులు.. పట్టాల నుంచి వచ్చే డగడగ శబ్దాలు.. ముఖ్యంగా వంతెనలు, క్రాసింగ్లు దాటేటప్పుడు వచ్చే ఆ కుదుపుల వల్ల నిద్ర భంగం కావడం ప్రయాణికులకు అనుభవమే. అయితే, అన్నీ కుదిరితే త్వరలోనే ఆ చిక్కులన్నీ కనుమరుగు కానున్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదించిన కొత్త టెక్నాలజీతో మీ ప్రయాణం మరింత సుఖవంతం కానుంది.
బరువు తక్కువ.. సామర్థ్యం ఎక్కువ
రైల్వే ట్రాక్లలో ఇప్పటివరకు వాడుతున్న ఇనుము, కాంక్రీట్ స్లీపర్లకు బదులుగా ‘కంపోజిట్ స్లీపర్లను’ ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
బలం: ఇవి తక్కువ బరువున్నా, ఒక చదరపు సెం.మీ.పై సుమారు 700 కిలోల లోడ్ను మోయగలవు.
కుషనింగ్: వీటిలో ఉండే మెరుగైన కుషనింగ్ వల్ల రైలు వెళ్తున్నప్పుడు వైబ్రేషన్స్ (కుదుపులు) చాలా తక్కువగా ఉంటాయి.
నిర్వహణ: వీటి నిర్వహణ ఖర్చు తక్కువ, మరమ్మతులు కూడా చాలా తేలిక. ముఖ్యంగా బ్రిడ్జ్లు, క్రాసింగ్ల వద్ద వీటిని ఎక్కువగా వాడనున్నారు.
ఏఐ (AI)తో స్మార్ట్ మానిటరింగ్
రైలు పట్టాల భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను రంగంలోకి దించుతున్నారు. ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మైక్రో టెస్టింగ్: పట్టాలలో ఉండే అతి సూక్ష్మమైన చీలికలను సైతం గుర్తించడానికి ‘మాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్’ విధానాన్ని అమలు చేస్తారు.
గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ (GPR): ఏఐ పరికరాలు అమర్చిన ఇన్స్పెక్షన్ వాహనాలు పట్టాల కింద నేల గట్టిదనాన్ని విశ్లేషిస్తాయి. ఎక్కడైనా పట్టా దెబ్బతిన్నా లేదా నేల కుంగినా ఏఐ ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనం:
ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను ముందే నివారించవచ్చు. అంతేకాకుండా, ట్రాక్ సమస్యల వల్ల రైళ్లు ఆలస్యంగా నడిచే పరిస్థితి తగ్గి, ప్రయాణం వేగంగా, సాఫీగా సాగుతుంది.