
సిల్వర్ మాంచి స్వింగ్లో ఉంది. బంగారంలా లక్ష దాటితేనే గుర్తిస్తారనంటే… నేను తగ్గనంటూ గతకొన్ని రోజులుగా ఉరుకులు పరుగులు పెడుతూ.. ఎట్టకేలకు మొన్నే లక్ష క్రాస్ చేసి ఇవాళ ఆల్ టైమ్ హైకి చేరింది. కమొడిటీ మార్కెట్లో ఈ ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా 3,016 రూపాయలు పెరిగి లక్షా 14వేలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణంతో పాటు ట్రేడర్లు బెట్టింగ్ వేయటం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు నిపుణులు. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలు, నెమ్మదించిన సేవా రంగం వంటి కారణాలు కూడా సిల్వర్ను పరుగులు పెట్టిస్తున్నాయంటున్నారు. ఇటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించి డాలర్ బలహీనపడితే… వెండి కిలో ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక గతేడాదితో పోల్చితే ప్రస్తుతం వెండి ధరలు 25 శాతం పెరిగాయి. ఈ ఏడాది చివరి నాటికి కేజీ వెండి ధర లక్షా 25వేలు దాటొచ్చంటున్నారు నిపుణులు. ఇక ప్రస్తుతం సమయంలో వెండి భవిష్యత్తు కోసం ఉత్తమ పెట్టుబడి ఎంపిక కాదంటున్నారు. స్టాక్ మార్కెట్లో ధరల పతనం సమయంలో మాత్రమే వెండి ధరలు పెరిగినట్లు చరిత్ర చెబుతోందంటున్నారు. మొత్తంగా వెండి పుంజుకున్నప్పటికీ బంగారం మాత్రం అక్కడే ఉండిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆమధ్య లక్ష దాటినా తిరిగి 96వేల దగ్గర స్థిరపడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి