కొంపముంచనున్న వెండి.. ఏకంగా 3లక్షల పైకి..! ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

బంగారం బాటలోనే ఇప్పుడు వెండి కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంది. కొన్ని నెలల క్రితం వరకు కిలో రూ.2 లక్షల లోపు పలికిన వెండి, ఇప్పుడు ఏకంగా రూ.2.50 లక్షల మార్కును తాకి సంచలనం సృష్టిస్తుంది. అంతటితో ఆగకుండా రాబోయే రోజుల్లో ఏకంగా కిలో రూ.3 లక్షలకు చేరనుందా? అనే చర్చ మార్కెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కొంపముంచనున్న వెండి.. ఏకంగా 3లక్షల పైకి..! ఈ లెక్కలు తెలిస్తే నోరెళ్లబెడతారు..
Will Silver Touch Rs 3 Lakh Per Kg By October 2026

Updated on: Jul 04, 2026 | 12:34 PM

గత కొన్ని నెలలుగా పసిడితో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. వెండి ధరల పెరుగుదలకు కేవలం ఒకే ఒక్క కారణం కాదని,5 ప్రధాన ప్రపంచ కారకాలు కలిసి ఈ లోహం ధరను పైకి నెట్టాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో వెండి కొత్త రికార్డు గరిష్ట స్థాయిలను తాకగలదని అనేక బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే.. 2026 అక్టోబర్ నాటికి వెండి ధర కిలోకు రూ.3 లక్షలకు చేరువ కాగలదా?అనే అంచనాలు ఊపందుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ వర్సెస్ దేశీయ ధరలు

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ వెండి ధర సుమారు 3శాతం పెరిగి, ఒక ట్రాయ్ ఔన్సుకు రూ.62.81కి చేరింది. డాలర్ మారకం రేటును, బరువు కొలతలను లెక్కిస్తే అంతర్జాతీయంగా ఒక కిలో ధర సుమారు రూ.1.92 లక్షలుగా ఉంటుంది. అయినప్పటికీ మన దేశంలో వెండి ధర ఒక కిలోకు సుమారు రూ.2.50 లక్షలు పలుకుతోంది. దీనికి ప్రధాన కారణం.. దిగుమతి సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, శుద్ధి, రవాణా ఖర్చులు, డీలర్ మార్జిన్లు, రూపాయి, డాలర్ మారకపు రేటు ప్రభావం. జూలై 3 నాటికి మన దేశంలో 999 స్వచ్ఛత గల వెండి ధర కిలో సుమారు రూ.2.30 లక్షలుగా ఉంది. కొన్ని నెలల క్రితం వరకు రూ.2 లక్షల కంటే తక్కువ ధరకు లభించిన వెండి, ఇప్పుడు ఒక్క రోజులోనే నగరాల్లో రూ.5,000 వరకు పెరిగి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ధరలు ఇంతలా పెరగడానికి 5 ప్రధాన ప్రపంచ కారణాలు..

బలహీనమైన అమెరికా ఉపాధి గణాంకాలు: జూన్ నెలకు సంబంధించిన అమెరికా ఉపాధి గణాంకాలు, వ్యవసాయేతర వేతనాల చెల్లింపులు ఊహించిన దానికంటే చాలా బలహీనంగా ఉండటంతో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందనే భావన మార్కెట్‌లో వ్యక్తమైంది. ఆర్థిక మందగమనం ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు.

యూఎస్ డాలర్ సూచీ పతనం: యూఎస్ డాలర్ సూచీ 101 కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు డాలర్లలోనే నిర్ణయిస్తారు కాబట్టి డాలర్ బలహీనపడటం వల్ల ఇతర దేశాల పెట్టుబడిదారులకు వెండి కొనుగోలు చౌకగా మారి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు: బలహీనమైన ఉద్యోగ గణాంకాల తర్వాత యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇకపై వడ్డీ రేట్లను త్వరగా పెంచకపోవచ్చని మార్కెట్ భావిస్తోంది. దీంతో పెట్టుబడిదారులు బాండ్లను వదిలి వెండి, బంగారం వైపు మళ్లుతున్నారు.

రాజకీయ అనిశ్చితి: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. ఈ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెడుతున్నారు.

పరిశ్రమల నుంచి రికార్డు డిమాండ్: గతంలో వెండి కేవలం ఆభరణాలు, పాత్రలకే పరిమితం కాగా.. ఇప్పుడు సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్‌వేర్, 5జీ, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి దీనికి విపరీతమైన పారిశ్రామిక డిమాండ్ ఏర్పడింది.

భవిష్యత్తు అంచనాలు: కిలో రూ.3 లక్షలు సాధ్యమేనా?

ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఆరవ సంవత్సరం కూడా వెండి సరఫరా కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రోకరేజ్ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..

మోతీలాల్ ఓస్వాల్: బలమైన పారిశ్రామిక డిమాండ్, ఈటీఎఫ్ పెట్టుబడుల కారణంగా 2026లో వెండి ధరలు కిలోకు రూ.3.20 లక్షలకు చేరవచ్చని, భవిష్యత్తులో రూ.3.20 లక్షల నుండి రూ.3.50 లక్షల శ్రేణే కొత్త సాధారణ స్థితి కానుందని తెలిపింది.

యాక్సిస్ డైరెక్ట్: 2026లో వెండి ధర కిలోకు రూ.2.40 లక్షలకు చేరవచ్చని అంచనా వేసింది.

జేపీ మోర్గాన్ – గోల్డ్‌మన్ సాక్స్: జేపీ మోర్గాన్ అంతర్జాతీయంగా వెండి ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతాయని విశ్వసిస్తుండగా, గోల్డ్‌మన్ సాక్స్ వెండిపై సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ అక్టోబర్ 2026 నాటికి ఎలాంటి అధికారిక నిర్దిష్ట లక్ష్యాన్ని ప్రకటించలేదు.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకుండా ఉండటం, డాలర్ బలహీనత, సోలార్, ఈవీ రంగాల నుండి బలమైన డిమాండ్.. ఈ మూడు పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో వెండి కిలో రూ.3 లక్షలకు చేరడం కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us