
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అడుగు వేసింది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విమానయాన రంగాలను ఆదుకునేందుకు సుమారు రూ.70,000 నుండి 80,000 కోట్ల వరకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 5.0 కింద ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సంక్షోభం, పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎస్బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి మాట్లాడుతూ.. రాబోయే 8 నుంచి 10 రోజుల్లో ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏవియేషన్ రంగానికి ఈ పథకం ఒక సంజీవనిలా మారనుంది. విమానయాన సంస్థల కోసం ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయించారు. ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ. 1,500 కోట్ల వరకు అప్పు పొందే అవకాశం ఉంది. ఈ రుణ కాలపరిమితి 7 ఏళ్లు కాగా, మొదటి 2 ఏళ్ల పాటు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
చిన్న తరహా పరిశ్రమలు తమ గరిష్ట నిర్వహణ మూలధనంలో 20 శాతం వరకు అదనపు రుణాలు పొందవచ్చు.
గరిష్ట రుణ పరిమితి: రూ. 100 కోట్లు.
రుణ కాలపరిమితి: 5 ఏళ్లు
ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. సుమారు 1.1 కోట్ల ఎంఎస్ఎంఈ ఖాతాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి. ఒక్కో ఖాతాకు సగటున రూ. 2 లక్షల నుంచి రూ. 2.3 లక్షల వరకు అదనపు నిధులు అందనున్నాయి. దీనివల్ల కంపెనీలు ఉద్యోగాలను కాపాడుకోవడమే కాకుండా, సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉత్పత్తిని కొనసాగించగలవు.