
Savings Account: నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) లావాదేవీలు పెరిగినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది నగదు (Cash) లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మీ పొదుపు ఖాతాలో (Savings Account) ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత నగదు జమ చేయడం మీకు చిక్కులు తెచ్చిపెట్టవచ్చు. అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ కొన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.
రూ.10 లక్షల పరిమితి జాగ్రత్త!
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే, బ్యాంకులు ఆ సమాచారాన్ని ‘యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్’ (AIR) ద్వారా ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. మీరు ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేయకుండా మీ ఆదాయ వనరులకు మించి పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తే ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే మీ ఆదాయానికి తగ్గట్టుగా ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. కానీ ప్రతి రూపాయికి సరైన ఆధారాలు ఉండాలి.
ఇది కూడా చదవండి: SBI YONO: వినియోగదారులను పరేషాన్ చేస్తున్న ఎస్బీఐ మెసేజ్.. సోషల్ మీడియాలో వైరల్.. విషయం ఏంటంటే..
పాన్ కార్డ్ నిబంధన:
బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. మీరు ఒకేసారి రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మీ పాన్ కార్డ్ వివరాలను సమర్పించాలి. కేవలం ఒకే ఖాతాలోనే కాకుండా ఒకే బ్యాంకులో మీకు ఉన్న వివిధ ఖాతాల్లో చేసే డిపాజిట్ల మొత్తం కూడా ఈ పరిమితి కిందకే వస్తుంది.
ఆధారాలు లేకపోతే భారీ జరిమానా:
ఒకవేళ మీకు ఐటీ నోటీసు వస్తే, ఆ నగదు ఎక్కడి నుండి వచ్చింది అనే దానికి తగిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సరైన సమాధానం చెప్పలేకపోతే, ఆ మొత్తంపై భారీ పన్నుతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు.
నిపుణుల సూచన:
పెద్ద మొత్తంలో నగదుతో లావాదేవీలు జరిపే కంటే డిజిటల్ ట్రాన్సాక్షన్లు (UPI, NEFT, RTGS) చేయడం ఉత్తమం. డిజిటల్ లావాదేవీలకు పూర్తి రికార్డులు ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో విచారణ ఎదురైనా సులభంగా సమాధానం చెప్పవచ్చు. మీ ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ఉంచుకోవడం ద్వారా అనవసరమైన చట్టపరమైన చిక్కుల నుండి తప్పించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి