
సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా..? పెట్టుబడి లేక ఆగిపోయారా..? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని మోడీ ప్రభుత్వం ఏకంగా 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రుణ పరిమితిని కూడా పెంచి సామాన్యులకు మరింత అండగా నిలుస్తోంది.
ఈ పథకం కింద ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండానే మూడు విడతల్లో రుణం పొందవచ్చు. మొదటి విడతలో రూ.15,000, మొదటి విడత సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ. 25,000 ఇస్తారు. రెండో విడత క్లియర్ చేశాక..మూడో విడతలో గరిష్టంగా రూ. 50,000 వరకు రుణం లభిస్తుంది. మొత్తంగా ఒక వ్యక్తి రూ. 90,000 వరకు ఆర్థిక సాయం పొంది తన వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
ఈ రుణం పొందడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా ఉంటే సరిపోతుంది. ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు అధికారులు మీ వివరాలను ధృవీకరించిన వెంటనే రుణం మంజూరు అవుతుంది. తిరిగి చెల్లించడానికి సులభమైన ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.
ప్రభుత్వం కేవలం అప్పు ఇవ్వడమే కాకుండా వ్యాపారులను డిజిటల్ బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే వ్యాపారులకు ప్రత్యేక క్యాష్బ్యాక్ లభిస్తుంది. వీధి వ్యాపారులకు యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
డిసెంబర్ 2025 నాటి గణాంకాల ప్రకారం.. ఇప్పటికే సుమారు 69.66 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. దాదాపు రూ.15,191 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.15 కోట్ల మంది చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని 2030 వరకు కొనసాగిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి